అన్నమయ్య జిల్లా అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత... టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు

  • రాయలసీమలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
  • కురబలకోట మండలం అంగళ్లులో టీడీపీ బ్యానర్ల చించివేత
  • వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న టీడీపీ వర్గీయులు
  • ఇరువర్గాల మధ్య ఘర్షణ.. టీడీపీ కార్యకర్తలకు గాయాలు
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరిలో భాగంగా రాయలసీమలో పర్యటిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో టీడీపీ ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేయడంతో వివాదం రాజుకుంది. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్ర, ఇతర టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. 

జెండాలను గాల్లో తిప్పుతూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకు వైసీపీ శ్రేణులు యత్నించినట్టు టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడికి దిగాయి. అంగళ్లు సెంటర్ వద్దకు ఇరువర్గాలు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకుండా, చోద్యం చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Angallu
TDP
YSRCP
Annamayya District

More Telugu News